శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (05:33 IST)

అన్ని ఉద్యోగాలూ అమ్మేసుకున్నారా? తెలంగాణ పోలీసు ఉద్యోగాలపై అనుమానాల వెల్లువ

దాదాపు పది వేల పోలీసు ఉద్యోగాల పోస్టుల భర్తీలో దారుణమైన అవకతవకలు జరిగాయంటూ జరుగతున్న ప్రచారం తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డును వణికిస్తోంది. ఒక రిక్రూట్మెంట్‌పై ఇన్ని అనుమానాలు, ప్

దాదాపు పది వేల పోలీసు ఉద్యోగాల పోస్టుల భర్తీలో దారుణమైన అవకతవకలు జరిగాయంటూ జరుగతున్న ప్రచారం తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డును వణికిస్తోంది. ఒక రిక్రూట్మెంట్‌పై ఇన్ని అనుమానాలు, ప్రచారాలు వెల్లువెత్తడం ఈ మధ్య కాలంలో ఎన్నడూ జరగలేదు. పైగా పోలీసు ఉద్యోగాలను నాలుగు లక్షలుపోసి పాడుకున్నారంటూ వాయిస్ రికార్డులతో సహా సోషల్ మీడియాలో చేస్తున్న వాదనలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎన్ని వివరణలు ఇస్తున్నా అభ్యర్థులు నమ్మకపోగా కొత్త విమర్శలు వెల్లువెత్తడంతోపాటు కోర్టుకు కూడా వెళ్లడంతో పోలీసు ఉద్యోగ నియామకాలపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
తెలంగాణలో భారీగా జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై కొంతకాలంగా పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో పలు వాయిస్ రికార్డులు, వాదనలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పనితీరుపై ఉద్యోగం ఆశించినవారి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్రకలకలం సృష్టిస్తోంది. ఉద్యోగాలకు ఎంపిక కానివాళ్లు పలు పాయింట్లను లేవనెత్తి విస్తృతంగా విమర్శలదాడి సాగిస్తున్నారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లకు ఉద్యోగాలు వచ్చాయని, భారీగా అవకతవకలు జరిగాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బున్నవారు ఉద్యోగాలు కొనుక్కున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగాల కొనుగోలుకు సంబంధించిన ఫోన్ సంబాషణ ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడిది తీవ్రచర్చనీయాంశమైంది.
 
మరోవైపు తొమ్మిదిమంది అభ్యర్థులు కానిస్టేబుళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌సిసి కోటాలో కంటే ఓపెన్ కోటాలోనే కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయని పిటీషనర్లు వాదించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన వాళ్ల అభ్యంతరాలను స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది.  దీంతో 10వేల పోస్టులు భర్తీచేశామన్న ఆనందం తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో కనిపించకుండా పోతోంది. కొందరు అభ్యర్థుల తీరు.. సోషల్ మీడియా ప్రచారం.. బోర్డును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. నియామకాల్లో ఎక్కడా పొరపాటు జరగలేదని బోర్డు అధికారులు చెబుతున్నారు.
 
సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో వీటిపై దృష్టిపెట్టిన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపెన్ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అనుమానాలు ఉన్నవారు నిజంగా మెరిట్ ఉండి ఉద్యోగం రాలేదన్నవారు బోర్డుకు దరఖాస్తు చేయొచ్చని వాళ్ల అనుమానాలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పూర్ణచందర్ రావు చెబుతున్నారు. గడువు ముగిసినా ఇంకా దరఖాస్తులు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఓపెన్ చాలెంజ్ చేసిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.