1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (08:07 IST)

వేషాలు మారిస్తే ఋషిపుంగవులైపోతారా? రేవంత్ రెడ్డి

ఈ నెల 30వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు దారితీసిందన్నారు. వీళ్లది దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్న పంచాయితీ, దళితుల భూములు లాక్కున్న పంచాయితీ అంటూ నిప్పులు కురిపించారు. 
 
దొంగ సొమ్ములో వాటాలు కుదరక జుట్లు పట్టుకుని కొట్టుకుని ఇపుడుడు ఉప ఎన్నిక తీసుకువచ్చారని అన్నారు. వేషం మార్చి బీజేపీ తరఫున పోటీచేస్తున్నంత మాత్రాన ఈటల ఉత్తముడు, ఋషిపుంగవుడైపోతారా? అంటూ నిలదీశారు. 
 
'వీళ్లిద్దరూ దేనికి కొట్లాడారు? పేదల పెన్షన్ కోసం కొట్లాడారా? రైతులకు గిట్టుబాటు ధర కోసం కొట్లాడారా? చదువుకున్న యువతకు ఉద్యోగాల కోసం కొట్లాడారా? రైతు రుణ మాఫీ కోసం కొట్లాడారా? డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కొట్లాడారా?' అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.
 
కేసీఆర్ తాను ప్రతి మహిళ పెద్దకొడుకునని చెప్పుకుంటున్నాడని, కేసీఆర్ పెద్దకొడుకు కాదని దొంగ కొడుకు అని మండిపడ్డారు. మన కన్న కొడుకులకు నౌకరీ ఇస్తే ఇవాళ ఇలా అడుక్కుతినే పరిస్థితి వచ్చేదా? అని ఆగ్రహం వెలిబుచ్చారు.