1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (21:37 IST)

తెరాస ప్లీనరీకి నోరూరించే 29 రకాల వంటకాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ ప్లీనరీ సమావేశం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ ఇంటర్నేషనల్  కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) జరుగనుంది. ఇందుకోసం 14 వేల మంది అతిథులను ఆహ్వానించనున్నారు. వీరికోసం 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వంటల తయారీ కోసం 5 వేల మంది పాకశాస్త్ర నిపుణులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ వంటల మెనూను ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ స్వయంగా ఎంపిక చేశారు. 
 
ఈ సారి సమావేశంలో సీఎం కేసీఆర్‌ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్‌ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు.
 
ఈ ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్‌ కమిటీ ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.
 
ఈ ప్లీనరీలో వడ్డించనున్న వంటకాలను పరిశీలిస్తే, ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు, క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌‌ అందజేయనున్నారు.