శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (13:43 IST)

ఐపీఎల్ బెట్టింగ్ : తల్లిని - చెల్లిని విషమిచ్చి చంపేసిన ఎంటెక్ కసాయి..

బెట్టింగ్ బాకీలు తీర్చేందుకు కన్నతల్లితోపాటు తోడబుట్టిన చెల్లిని ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడో కసాయి. అన్నంలో విషం పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి ఊరు ఊరంతా అయ్యోపాపం అంటూ కన్నీరుకార్చినా.. తనను నవమాసాలు పెంచి జన్మనిచ్చిన తల్లికోసం, తోడబుట్టిన చెల్లి కోసం కనీసం ఓ కన్నీటి చుక్కైనా ఆ కిరాతకుడు రాల్చలేదు. దీంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు లోగుట్టు బహిర్గతమైంది. ఈ ఘాతుకం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన పల్లి ప్రభాకర్‌రెడ్డి, సునీత అనే దంపతులకు కుమారుడు సాయినాథ్‌ రెడ్డి, కుమార్తె అనూషలు ఉన్నారు. అయితే, మూడేళ్ళ క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ రెడ్డి చనిపోయారు. అప్పటి నుంచి తల్లే బిడ్డలను పోషిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో సాయినాథ్‌ రెడ్డి కండ్లకోయ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి అదే కాలేజీలో ఎంటెక్‌ చేస్తూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయినాథ్‌ రెడ్డి బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. దీంతో ఎక్కడ చూసినా అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో తండ్రి ప్రభాకర్‌ రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన రూ.18 లక్షలు బ్యాంకులో ఉండటాన్ని సాయినాథ్‌ రెడ్డి గమనించాడు. 
 
తల్లికి, చెల్లికి తెలియకుండా బ్యాంకులోని డబ్బులు డ్రా చేయడంతో పాటు ఇంట్లో ఉన్న 10 నుంచి 15 తులాల బంగారు నగలను కూడా అమ్మేశాడు. ఈ విషయం ఇంట్లో తెలుస్తుందోనని భయాందోళనలకు గురైన సాయినాథ్‌ రెడ్డి తన తల్లి, చెల్లిని కడతేర్చాలని ప్లాన్ వేశాడు. ఈనెల 23న తినే అన్నంలో రసాయన గుళికలు కలిపాడు. 
 
అదే అన్నంను కంపెనీకి వెళ్తూ టిఫిన్‌ తీసుకెళ్లాడు. విషాహారం తిన్న తల్లి, చెల్లెలు.. 'కడుపులో తిప్పినట్లు అవుతోంది' అంటూ సాయినాథ్‌ రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఇంటికి వచ్చిన అతడు తల్లి, చెల్లెలు తమను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా వినలేదు. స్పృహ తప్పిపోయే వరకు వేచిచూసి 23వ తేదీన రాత్రి 8 గంటలకు మేడ్చల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
 
ఆరోగ్యం విషమించిందనే కారణంతో.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే వారిని సుచిత్ర పరిధిలోని రెనోవా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ, తనవద్ద వైద్యానికి డబ్బులు లేవంటూ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించాడు. నవంబరు 24న తెల్లవారుజాముకల్లా గాంధీకి చేరుకున్నారు. ఇక్కడ చికిత్స మొదలైన తర్వాత.. నాలుగోరోజున (27వ తేదీన) చెల్లెలు అనూష మృతిచెందగా, ఐదో రోజున (28న) తల్లి సునీత మృతిచెందారు. 
 
ఈ మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేశారు. పైగా, విచారణ చేపట్టకుండానే మృతదేహాల్ని మేడ్చల్‌ పోలీసులు సాయినాథ్‌కు అప్పగించారు. అయితే, తల్లి, చెల్లికి అంత్యక్రియలు నిర్వహించే బంధువులతో పాటు.. గ్రామస్తులంతా బోరున విలపించారు. కానీ, సాయినాథ్ కంట మాత్రం చుక్క కన్నీరు రాలేదు. 
 
క్రమంలో సాయినాథ్‌ రెడ్డిని బంధువులు, గ్రామస్తులంతా కలిసి నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిరాతకుడుని పోలీసులు అరెస్టు చేశారు.