శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:42 IST)

లాక్‌డౌన్ పొడగింపుపై భిన్నాభిప్రాయాలు... తెలంగాణాలో మాత్రం...

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడగించే విషయంపై రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే నెలాఖరు వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడగించాలన్న పట్టుదలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. 
 
కాగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణాలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ హైదరాబాద్ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా సీరియస్‌గా ఉందని కేంద్రం కూడా హెచ్చరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోల్చితే, హైదరాబాద్ నగరంలో కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచారు. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ చివరి లింకును తెంచేవరకు పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పైగా, ఈయన ఇప్పటికే లాక్‌డౌన్‌ను మే ఏడో తేదీవరకు పొడగించారు. అయితే, ఇపుడు జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ పొడగించే అంశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేసీఆర్ ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి.. మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడగించాలన్న ధోరణితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.