శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (19:06 IST)

ఆ రకం మతాబులకు సుప్రీంకోర్టు పచ్చజెండా!!

తెలంగాణాలో టపాకాయల విక్రయం, వినియోగంపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్ తరపున అపెక్స్ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. గ్రీన్ కాకర్స్‌కు పచ్చజెండా ఊపింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రాకర్స్‌పై నిషేధం విధించడం వలన తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని, అలాంటప్పుడు తయారీకి ఎందుకు అనుమతులు ఇచ్చారని కోర్టుకు విన్నవించారు. 
 
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పండుగ పూట రెండు గంటల పాటు టపాకాయలు కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఎన్జీటీ తీర్పునకు లోబడే టపాకాయలు కాల్చాలని, హైకోర్టు ఆదేశాలు కూడా ఉండాలని సూచించింది. 
 
అంతకుముందు, నవంబర్ 9న బాణసంచా వినియోగంపై ఎన్జీటీ విచారణ జరిపింది. వాయుకాలుష్యం తీవ్రత ఎక్కువ ఉన్న నగరాలు, పట్టణాల్లో బాణసంచా పూర్తిగా నిషేధించాలని, గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లో టపాసులు నిషేధం కొనసాగాలని స్పష్టంచేసింది. 
 
ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డిలో బాణాసంచాను నిషేధించాలని ఆదేశించింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ను వినియోగించుకోవచ్చునని సూచించింది. 
 
దీపావళి రోజున కేవలం 2 గంటలు మాత్రమే పర్యావరణ హితమైన క్రాకర్స్ వాడాలని చెప్పింది. ఆ సమయాన్నితెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని తీర్పులో పేర్కొంది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.