శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (16:48 IST)

పటాకుల పేలుళ్లు లేకుండా దీపావళి పండుగ జరుపుకోండి.. హైకోర్టు

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చకుండా ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ ఇంద్రప్రకాశ్ ఈ పిల్ వేశారు. బాణసంచా కాల్చడం వల్ల వచ్చే పొగతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతారని... కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో బాణసంచాపై నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు.
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీచేసింది. బాణసంచా షాపులను మూసేయాలని ఆదేశించింది. క్రాకర్స్‌ను అమ్మడంకానీ, కొనడంకానీ చేయొద్దని తెలిపింది. తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 19న వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, టపాకాయలు కాల్చకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలని పేర్కొంది. 
 
కాగా, ఇపట్పికే ఢిల్లీ, రాజస్థాన్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు పటాకుల అమ్మకాలు, విక్రయాలపై బ్యాన్‌ విధించాయి. మహారాష్ట్రలో బాణాసంచాపై బ్యాన్‌ విధించకపోయినా.. వాటికి దూరంగా ఉండాలని సూచించింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోనూ కాళీమాత పూజ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు విక్రయాలపై, కాల్చడాన్ని నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యూబీపీసీబీ) రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్‌ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేసింది.