శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (17:46 IST)

పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లామైంది, పెండ్లి మండపంలో ఏం జరిగింది?

మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో తాళి కట్టబోతున్న పెండ్లి కుమారుడికి షాకిచ్చింది పెళ్లి కూతురు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మండపంపై చెప్పడమే కాకుండా పోలీసులను కూడా పిలిచింది. దీనితో పెళ్లి ఆగింది. ఐతే అదే పెళ్లికి వచ్చిన ఓ యువతిని పెళ్లాడుతానంటూ వరుడు చెప్పడంతో ఆ యువతి అనూహ్యంగా పెండ్లి కుమార్తె అయ్యింది. అతడికి భార్య అయ్యింది. అసలు ఏం జరిగింది?
 
వివరాల్లోకి వెళితే... గురువారం నాడు మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్యతో వివాహాన్ని పెద్దల సమక్షంలో చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వధూవరులు పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఐతే అకస్మాత్తుగా వధువు తన సెల్ ఫోను నుంచి పోలీసుల కోసం 100కి డయల్ చేసింది. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
 
పీటల పైనుంచి లేచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ, తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడుతానంటే పెద్దల అంగీకరించలేదనీ, తను ఈ పెళ్లి చేసుకోనని తెలిపింది. దీనితో పోలీసులు కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను వివాహం చేసుకునేందుకు పెద్దలు అడ్డు చెప్పరాదని కోరారు. శుక్రవారం నాడు మండలంలోని జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
 
మరోవైపు తను మనువాడాల్సిన యువతి అలా ప్రేమికుడితో వెళ్లిపోవడంతో వరుడు అదే మండపంలో తన పెళ్లిని చూసేందుకు వచ్చిన దూరపు బంధువుల అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో అదే వేదికపై ఇద్దరికీ పెళ్లి జరిపించేశారు.