1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (19:01 IST)

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, యాదాద్రి కలశాలకు సారూప్యత ఉందా?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశాలకు సారుప్యత ఉందా? అంటే... ఉందని ఒప్పుకోక తప్పదు. ఏవిధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు యాదాద్రి కలశాలకు ఉపయోగించినది ఈ సాంకేతికతనే.

 
నాసా లేదంటే మన ఇస్రోలో రక్షణ వ్యవస్థలు లేదంటే యంత్రసామాగ్రి పరిరక్షణకు ఈ గోల్డ్‌ కోటింగ్‌ సాంకేతికతనే వినియోగిస్తుంటారు. అదే తరహా సాంకేతికతను హైదరాబాద్‌ సమీపంలోని యాదాద్రి దేవాలయ బంగారు కలశాలపై కూడా ఉపయోగించారు. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి మార్చి 28వ తేదీన భక్తుల కోసం తెరువబోతున్నారు.
 
హైదరాబాద్‌కు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా 52 అతి సున్నితంగా రూపొందించిన కలశాలు ఉన్నాయి. ఈ కలశాలను చెన్నైకు చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ తీర్చిదిద్దింది. ఈ కంపెనీ భారతదేశంలో అతి ప్రధానమైన దేవాలయాలకు పనిచేయడంతో పాటుగా అంతర్జాతీయంగా పలు దేవాలయాలకు బంగారు తాపడం, దేవతామూర్తులకు బంగారుతాపడం చేయడం వంటి పనులెన్నో చేస్తుంది.

 
ఈ నెలల్లోనే ప్రజల సందర్శనార్థం దేవాలయం తెరువనుండటం వల్ల నరసింహ స్వామి ఆశీస్సుల కోసం వచ్చే భక్తులను ఈ కలశాలు ఆకట్టుకోనున్నాయి. స్మార్ట్‌ క్రియేషన్స్‌ ఫౌండర్‌ పంకజ్‌ భండారీ మాట్లాడుతూ, ‘‘దేశ విదేశాలలో దేవాలయాలకు బంగారు తాపడాలు చేయడంలో రెండు దశాబ్దాల చరిత్ర మాకు ఉంది. గత 24 సంవత్సరాలుగా దాదాపు 5500 దేవాలయాల్లో మేము మా 100కు పైగా కళాకారులు, వారి కుటుంబాలతో ఈ పనులను చేశాము’’ అని అన్నారు.
 
ఈ ఎన్‌టీడీజీ సాంకేతికతను గురించి ఆయన వెల్లడిస్తూ, ‘‘ఇది పేటెంటెడ్‌ సాంకేతికత. దీనిలో బంగారం అతి తక్కువగా వినియోగించడం జరుగుతుంది. మా బంగారు దేవాలయ ప్రాజెక్టులన్నీ కూడా సాధారణంగా భక్తుల విరాళాల మీదనే సాగుతుంటాయి. ఎన్‌టీజీడీ సాంకేతికతతో ఈ ప్రాజెక్టులు అందుబాటు ధరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో చదరపు అడుగుకు 5 గ్రాముల బంగారం వినియోగం తగ్గుతుంది. అలాగే గోల్డ్‌ కోటింగ్‌తో పోలిస్తే ఈ విధానంలో మందం కూడా మైక్రాన్‌లకు తగ్గుతుంది. అంతేకాదు, సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దీనిని నిర్వహించడం సులభం. ఇంకో విషయయేమిటంటే, ఏ సమయంలో అయినా దీనిలో వాడిన బంగారం మొత్తం తిరిగిపొందవచ్చు’’ అని అన్నారు.