1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (18:41 IST)

రోడ్డు ప్ర‌మాదంలో యువ‌తి మృతి: పార్టీలో ఎంజాయ్.. వేగంగా కారు నడపటంతో?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత అనే అమ్మాయి కెనడాలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే నగరానికి వచ్చిన ఆమె ఆదివారం ఫ్రెండ్ షిప్‌డే కావడంతో తన స్నేహితులైన అభిషేక్, సత్య ప్రకాష్, తరుణిలతో కలిసి వేడుకల్లో పాల్గొంది. వీరంతా అర్ధరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లోని ముగ్గురు అబ్బాయిలు మద్యం సేవించారు. ఇంటి కెళ్లే క్రమంలో అభిషేక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మద్యం మత్తు పైగా అతివేగంతో కారు నడపడం వల్ల గచ్చిబౌలి బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది.
 
ఆ ప్రమాదంలో ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆశ్రిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో ఆశ్రిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.