మద్యం కోసం క్యూలో నిలబడతాం.. ఇపుడు మంచి పని కోసం నిలబడితే తప్పేంటి?: మోహన్ లాల్
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్వర్క్ సైట్లో ఓ పోస్ట్ చేశారు.
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన తన సోషల్ నెట్వర్క్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం స్వాగతించదగ్గ చర్యగా అభివర్ణించారు.
'పాత నోట్లను ఉపసంహరించడాన్ని మంచి సంకల్పంతో చేసిన మెరుపుదాడిగా భావిస్తున్నాను. చెప్పినట్టుగానే ప్రధాని మోడీ పనులు చేస్తున్నారు. నేను వ్యక్తులను ఆరాధించను. కానీ నిజాయితీగా తమ ఆలోచనలను అమలు చేసే వారిని ఎక్కువగా అభిమానిస్తాను. రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయడం నిజాయితీతో తీసుకున్న నిర్ణయమే. ఆరంభంలో నోట్ల కష్టాలు ఎదురైనా భవిష్యత్లో మనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అవివేకంతో ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోరని మనం గుర్తించాలి. మద్యం షాపులు, సినిమా థియేటర్లు, ప్రార్థనా స్థలాల్లో మనం క్యూలో నిలబడుతుంటాం. మంచి పని కోసం మనం క్యూలో నిలబడటం వల్ల హాని జరగదని నా అభిప్రాయమ'ని మోహన్లాల్ పేర్కొన్నారు.