శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:37 IST)

మెగా ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ? త్వరలో ఆచార్య షూటింగ్ స్టార్ట్!

తెలుగులో వరుస హిట్లతో దూసుకెళుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ యేడాది ఇప్పటికే రెండు సూపర్ డూపర్ హిట్ మూవీల్లో నటించింది. అందులో ఒకటి యువ హీరో నితిన్ నటించిన "భీష్మ" చిత్రం ఒకటి కాగా, మరొకటి ప్రిన్ మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం. ఇపుడు మరో మెగా ఆఫర్‌ను కొట్టేసింది. 
 
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. 
 
సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ పాత్ర కోసం హీరోయిన్ రష్మికను సంప్రదించినట్టు సమాచారం. ఆమె అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. మరో 15 రోజుల్లో షూటింగ్ ప్రారంభించాలని కొరటాల భావిస్తున్నారట. ముందుగా చెర్రీ నటించే సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. 
 
ఇదిలావుండగా, స్టార్ హీరోలు కరోనా భయాన్ని అధిగమించి ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు హాజరవుతున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మహేష్ కూడా ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. అలాగే నాగచైతన్య కూడా 'లవ్‌స్టోరీ' షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో 'ఆచార్య' సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. 
 
అయితే షూటింగ్ మొదలైనా.. చిరంజీవి మాత్రం సెట్స్‌పైకి రారని సమాచారం. ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా చెర్రీ సీన్లను చిత్రీకరిస్తారట. కేవలం 30 శాతం మంది సిబ్బందితో మాత్రమే షూటింగ్ చేస్తారట.