గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (15:14 IST)

మహిళ ప్రధాన పాత్రగా అయ్యప్ప సినిమా.. వివాదాలకు దారితీస్తుందా..?

ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసే హీరోయిన్లలో అనుష్క ముందు వరుసలో ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో గ్లామరస్ పాత్రలు చేసిన అనుష్క అరుంధతి సినిమాతో తనలోని రెండో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశారు. ఇక బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2018వ సంవత్సరంలో భాగమతి చిత్రంతో భయపెట్టిన అనుష్క.. ఇప్పుడు సైలెన్స్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
 
ప్రస్తుతం ఒక చిత్రం సెట్స్‌పై ఉండగానే.. మళ్లీ మరో బహుభాషా చిత్రాన్ని అంగీకరించారు అనుష్క. శబరిమల అయ్యప్ప స్వామిపై నిర్మించనున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందిలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గోకులం ఫిల్మ్స్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు ప్రశాంత్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ సంవత్సరం ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని చెన్నై సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి విశేషమేమిటంటే ఈ చిత్రానికి మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారు. సంతోష్ శివన్ వరసపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో జాక్ అండ్ జిల్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనుష్కతో సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.
 
సంతోష్ మాట్లాడుతూ.. ఇంతవరకు బాగానే ఉన్నా.. అయ్యప్పపై సినిమా కాబట్టి ఇది వివాదాలకు దారి తీస్తుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయ్యప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశం విషయం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మహిళ ప్రధాన పాత్రగా అయ్యప్ప సినిమా వస్తుందంటే ఇదెన్ని వివాదాలకు దారితీస్తుందోనని చాలామంది అనుకుంటున్నారు.