శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (14:30 IST)

పోలీస్ స్టేషన్‌కు చేరిన దాసరి కుటుంబ ఆస్తుల గొడవ?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు దివంగత డాక్టర్ దాసరి నారాయణ రావు కుటుంబ ఆస్తి గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దాసరి ఇద్దరు కుమారులైన ప్రభు, అరుణ్‌ల మధ్య నెలకొన్న వివాదం కాస్త పెద్దదిగా మారి, ఠాణావరకు వెళ్లారు. ఇది టాలీవుడ్‌లో రచ్చరచ్చగా మారింది. 
 
ఆస్తి వివాదంలో అన్నదమ్ములు కయ్యానికి కాలు దువ్వుకున్నారు. అరుణ్ కుమార్‌పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి అరుణ్ అక్రమంగా చొరబడ్డాడని ఫిర్యాదులో తెలిపాడు.
 
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ, నాన్న రాసిన వీలునామా ప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. తన మనవరాలికి నాన్న ఈ ఇంటిని రాసిచ్చారని అన్నారు. అయితే, ఈనెల 24 రాత్రి అరుణ్ తన ఇంటి గేటును దూకి లోపలకు ప్రవేశించాడని తెలిపారు. 
 
ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని... తనను, తన భార్యను, అత్తామామలను దారుణంగా తిడుతూ, కొట్టాడని చెప్పారు. అరుణ్ భార్య కూడా దుర్భాషలాడిందని తెలిపారు. పోలీసుల ముందు కూడా దాడి చేశాడని చెప్పారు.
 
తమ్ముడై ఉండి కూడా అరుణ్ తనపై, తన కుటుంబంపై దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ప్రభు మండిపడ్డారు. ఈ విషయంలో మోహన్ బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. వీరంతా ఎందుకో మౌనం వహిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.