బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (09:05 IST)

చేతబడి అనుమానం... తల తెగనరికి... ఠాణాకెళ్లి లొంగిన నిందితుడు.. ఎక్కడ?

చేతబడి అనుమానంతో ఓ వ్యక్తి తల తెగనరికి, ఆ తలను చేతపట్టుకుని ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి వెళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపోయిన దారుణ ఘటన ఒకటి ఒడిషా రాష్ట్రంలో జరిగింది. ఒక చేతిలో తల, మరో చేతిలో తలను తెగనరికిన గొడ్డలిని చూసిన పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని ఖుంటూ పోలీస్ స్టేషన్ పరిధిలో నువాసహి అనే గిరిజన గ్రామమానికి చెందిన బుద్దురామ్ సింగ్ (30) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఈయన కుమార్తె ఒకరు అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచింది. 
 
అయితే, తన కుమార్తె చనిపోవడానికి వరుసకు అత్త అయిన చంపాన్ సింగ్ (60) అనే వృద్ధురాలు కారణమని బుద్దారామ్ సింగ్ బలంగా నమ్మాడు. చంపాన్ సింగ్ చేతబడి చేయించడం వల్లే తన కుమార్తె చనిపోయిందని అనుమానించి, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ పథకంలో భాగంగా, సోమవారం ఉదయం ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్‌ సింగ్‌ను బుద్దురామ్‌సింగ్ బయటకు ఈడ్చుకొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, ఆ తలను తువ్వాలులో చుట్టుకుని, హత్యకు ఉపయోగించిన గొడ్డలి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తల, గొడ్డలితో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని చూసిన పోలీసులు హడలిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.