కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!
అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఓ దారుణం జరిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఓ భార్య తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఆ తర్వాత ఏమీ జరుగనట్టుగా అదే ఇంట్లో జీవనం కొనసాగించింది. తన భ ర్త పనిమీద బయటకు వెళ్లాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. అయితే, మృతుడు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 26వ తేదీన ఘటన జరిగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు.. గౌహతికి చెందిన రహీమా, సబియాల్ రెహ్మాన్ (38) దంపతులు. 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పాత ఇనుపసామాన్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో గౌహతి జోయ్ మతి నగర్లోని తమ ఇంట్లోనే రహీమా భర్తను హత్య చేసింది.
ఎవరికీ తెలియకుండా ఇంటి ఆవరణలోనే ఐదడుగుల గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టింది. బిజినెస్ పనిమీద భర్త కేరళ వెళ్లాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఎన్ని రోజులు గడుస్తున్నా రెహ్మాన్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అక్కడి వారికి అనుమానం బలపడింది. వారి దృష్టిని మరల్చేందుకు.. తన ఆరోగ్యం బాగోలేదని పొరుగింటివారికి చెప్పి అక్కడి నుంచి పరారైంది.
కానీ, రహీమా కట్టుకథలు అక్కడి వారి అనుమానాలను బలపరిచాయి. దీంతో రెహ్మాన్ సోదరుడికి సమాచారం ఇచ్చారు. జులై 12న అతడు పోలీసులను ఆశ్రయించి.. తన సోదరుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే.. రహీమా పోలీసుల ఎదుట లొంగిపోయింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. జూన్ 26న అతడిని చంపేసినట్లు చెప్పింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వెళ్లి.. మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.