1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 29 జులై 2020 (20:25 IST)

పూజాహెగ్డెపై ఫైర్ అవుతున్న అఖిల్ ఫ్యాన్స్..!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ నటించిన ఫస్ట్ మూవీ అఖిల్, రెండో సినిమా హలో, మూడో సినిమా మిస్టర్ మజ్ను చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
 
ఫామ్‌లో లేని బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ పట్టాన కథను ఓకే చేయరు. దీనికితోడు నాగార్జున అఖిల్‌కి హిట్ ఇచ్చే బాధ్యతలను అల్లు అరవింద్‌కి అప్పచెప్పడంతో కథపై చాలా కసరత్తు చేసారని వార్తలు వచ్చాయి. 
 
దీంతో అభిమానులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ సక్సస్ పైన చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్‌లో పూజా హేగ్డే కాలుతో అఖిల్ చెవిని టచ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ పోస్టర్ రిలీజ్ చేసారో అఖిల్ ఫ్యాన్స్‌కి బాగా కోపం వచ్చింది. అఖిల్ బాబుని పూజా హేగ్డే కాలుతో తన్నుతుందా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
 
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మా అఖిల్ బాబుపై పెట్టిన కాలు తీయ్ పూజా అంటూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అసలు హీరోయిన్ కాలుతో హీరో చెవిని టచ్ చేయడం ఏంటో..? ఇదేం రొమాన్సో... అర్ధం కావడం లేదు అంటూ బాధపడుతున్నారు అభిమానులు. బొమ్మరిల్లు భాస్కర్‌కి తెలియలేదు సరే... ఎంతో అనుభవం ఉన్న నాగార్జునకు కూడా తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. మరి... ఈ పోస్టర్‌కి వచ్చిన స్పందనపై నాగార్జు కానీ, అఖిల్ కానీ స్పందిస్తారేమో చూడాలి.