1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:42 IST)

వ్యవసాయం చేస్తున్న ప్రకాష్ రాజ్ .. మామిడికాయలు అమ్ముతున్న తనయుడు

దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విలక్షణ నటుడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడు ఇలా ఏ క్యారెక్టర్లోనైనా జీవించగల నటుడు ప్రకాష్ రాజ్. అలాంటి నటుడు ఇపుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన తనయుడు మామిడి కాయలు విక్రయిస్తున్నాడు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజమండి. 
 
కరోనా వైరస్ దెబ్బకు యావత్ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో తన భార్యా పిల్లలతో సేదతీరుతున్నారు. గత 40 రోజులుగా ఆయన ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. 
 
తాజాగా, ఫాంహౌస్‌లో మామిడి చెట్లకు కాసిన కాయలను కోశారు. ఆ కాయల మధ్య ప్రకాష్ తనయుడు వేదాంత్ రాజ్ కూర్చొన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, దానికింద... మావాడు మామిడి కాయల వ్యాపారి అయ్యాడంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. 
 
నిజానికి ఈ వ్యవసాయ క్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో అన్ని రకాల పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. 
 
సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో ఎంతో క్రూరంగా కనిపించే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సామాజిక స్పృహ కలిగిన, నిజమైన భారతీయుడులా నడుచుకుంటున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన వెయ్యి కుటుంబాలను పోషిస్తూ తనలోని పెద్దమనసును చాటిచెప్పాడు.