1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:01 IST)

"పుష్ప" లీకులపై బన్నీ ఆగ్రహం : అలా చేస్తేనే కిక్ అంటున్న మైత్రీ మూవీస్!

దర్శకుడు కె. సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అయితే, ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ఎడిటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో లీకుల బెడద చుట్టుకుంది. 
 
ఇటీవల ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
 
ఈ విషయం తెలిసిన కథానాయకుడు అల్లు అర్జున్‌ ఆశ్చర్యపోయారు. లీక్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిత్రీకరణ సమయంలోనే కాదు, ఎడిటింగ్‌ రూమ్‌లోకి కూడా మొబైల్‌ ఫోన్లను అనుమతించవద్దని చిత్ర బృందాన్ని ఆదేశించారు. లీక్‌ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని నిర్మాతలను కోరినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ లీకులపై మైత్రీ మూవీ మేకర్స్‌ చిత్ర బృందం స్పందించింది 'సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు లీక్‌ అవ్వడం మమ్మల్ని బాధించింది. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇంకొక విషయమేంటంటే, దయ చేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు. తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే కిక్‌ ఉంటుంది. ముందుగా వస్తే దాని విలువ తెలియదు. తాజా ఘటనపై మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాం. నిందుతులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం' అని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నిర్మాత వై.రవి శంకర్‌ అన్నారు.