1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (20:24 IST)

సమాజం మారేవరకు నాకెవ్వరూ శుభాకాంక్షలు చెప్పకండి.. రష్మీ గౌతమ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ నటి, బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రస్థాయిలో మండిపడింది. తనకు ఎవరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొద్దని కోరారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని రష్మీ ఓ వీడియోని షేర్‌ చేసింది. ఆ వీడియో చూస్తే.. మహిళ దినోత్సవం రోజు మహిళకు ఎంత చక్కగా గౌరవం దక్కిందో, దక్కుతుందో అర్థమైపోతుంది. 
 
వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న, ఓ గొప్ప మనసున్న మహిళను.. ఒక పోకిరి ఎలా దూషించాడో రష్మీ షేర్‌ చేసిన వీడియో చూస్తే.. సభ్య సమాజం తలదించుకోక మానదు. పైగా ఆ పోకిరి తల్లిదండ్రులు కూడా వాడి పక్కనే ఉండటం ఈ వీడియోలో ఉన్న మరో విశేషం. 
 
మా వీధి కుక్కలకు మీరెవరు ఫుడ్‌ పెట్టడానికి అనేలా.. ఫుడ్‌ పెట్టడానికి వచ్చిన మహిళపై గొడవ పెట్టుకున్న ఆ పోకిరి.. ఆ మహిళను 'లం*' అని దూషించడమే కాకుండా.. తన కాలికున్న చెప్పు తీసి విసిరి కొట్టాడు. నిజంగా సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని ఆ పోకిరి అలా చేశాడో తెలియదు కానీ.. మహిళ ఇంకా ఇలాంటి పరిస్థితులనే అనుభవిస్తుందని రష్మీ వంటి మహిళలు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఘటనపై మండిపడుతున్నారు. 
 
యాంకర్‌ రష్మీ ఈ వీడియోని షేర్‌ చేసి.. ఇంకా మగాడు మహిళపై దారుణంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దయచేసి నాకెవ్వరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పకండి.. అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. 
 
దయచేసి క్షమించండి.. ఈ సమాజం మారేవరకు నాకెవ్వరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపవద్దు. మహిళలను ఇంకా మగాడు బహిరంగంగా దూషిస్తూనే ఉన్నాడు. బూతులు తిడుతున్నాడు. తల్లిదండ్రులు పక్కన ఉండగానే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధేస్తుంది. 
 
అందుకే ఈరోజు స్పెషల్‌గా చూడకండి. నార్మల్‌గానే చూడండి. సెలబ్రేషన్స్‌ చేసుకునేంత గొప్పరోజుగా మాత్రం భావించకండి. మానవత్వం మనుషులంతా సమానమే అని చెబుతుంది. సమస్యకు పరిష్కారంగా నాగరికత అనే ఎంపిక ఎప్పుడూ ఉంటుంది.. అని రష్మీ తన ఇన్‌‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.