1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (11:48 IST)

శృతి హాసన్‌ను కలిసిన ఆ ఇద్దరు..?

ఈ మధ్యకాలంలో శృతిహాసన్ బ్రేకప్ సంచలనంగా మారిన తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. చివరిగా పవన్ కల్యాణ్‌తో కాటమరాయుడు సినిమాతో సినీ పరిశ్రమకు దూరమైన ఆమె ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. 
 
బ్రిటన్‌లోని రాక్ బ్యాండ్ సభ్యుడు మైఖేల్ కోర్సలేతో కొద్దికాలం ప్రేమలో మునిగిన తర్వాత దాదాపు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా వారిద్దరికీ బ్రేకప్ కావడంతో ఇప్పుడు శృతి అటు మ్యూజిక్, ఇటు సినిమాపై దృష్టి పెట్టింది.
 
హాలీవుడ్‌లో శృ‌తి హాసన్ ఓ అమెరికన్ సిరీస్‌కు ఒకే చెప్పి, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకొంది. త్వరలోనే ట్రెడ్‌స్టోన్ అనే సిరీస్‌లో నటించనున్న శృతి దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ముంబైలో శృతితో కలిసి రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ముంబైలో ఉంటున్న శృతిహాసన్‌ను రానా, ప్రకాశ్ కోవెలమూడి వెళ్లి, కలిశారు. వారంతా ఏదో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపారు, కానీ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే రానా, శృతితో ప్రకాశ్ సినిమా చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీరందరూ కలిసి చేసిన హంగామాలో జోష్ ఏ మాత్రం తగ్గనట్లుగా కనిపిస్తోంది.