1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (13:25 IST)

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త వ్యక్తి అరెస్ట్

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి అందరికీ తెలిసిందే. గత ఏడాది జూన్ లో ముంబైలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నా అభిమానులు.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆయన తరపున ఎంతో మంది పేదలకు సుశాంత్ కా కిచెన్ అనే పేరుతో నిత్యావసరాలను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో పలు అనుమానాలు ఎదురవడంతో డ్రగ్స్ కేసు బయటపడింది.
 
ఈ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. పేరు బయటపడగా ఎన్ సీ బీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మరింత కోణంతో ఈమెతో పాటు మరో తొమ్మిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో హేమల్ షా అనే వ్యక్తికి సంబంధం ఉందని తేలింది. దీంతో ఎన్ సీ బీ అధికారులు అతనిని శుక్రవారం రోజు అరెస్టు చేశారు.
 
ఇక దీని గురించి ఎన్సిబీ అధికారి మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ మృతి కేసు పై విచారణ జరుపుతున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారంలో హేమల్ షా అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు తమకు తెలిసిందని, దీంతో అతన్ని యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధికారులు ఓ పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం గోవాలో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.