శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (08:27 IST)

బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. "నాయక్" నటుడు అరెస్టు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. తాజాగా డ్రగ్స్ కలకలం చెలరేగింది. దీంతో ప్రముఖ హిందీ నటుడు, బిగ్ బాస్ సీజన్-7 పోటీదారుడు అయిన ఎజాజ్ ఖాన్‏ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. 
 
ఈయన తెలుగులో "రక్త చరిత్ర", "నాయక్" వంటి సినిమాల్లో విలన్‏గా నటించాడు. ఎజాజ్‏కు సంబంధించిన అంథేరి, లోఖండ్ వాలాలోని పలు చోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాజస్థాన్ నుంచి ముంబై వస్తున్న క్రమంలో ఎజాన్ ఖాన్ ఎయిర్ పోర్టులోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా, బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎన్సీబీ రంగంలోకి దిగింది. సుశాంత్ ఆత్మహత్యకు డ్రగ్స్ వ్యవహారం ప్రేరణగా నిలిచిందనే ఆరోపణలపై ఎన్సీబీ బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులపై పంజా విసిరింది. పలు సెలబ్రిటీల నివాసాలపై మెరుపు దాడులు నిర్వహించి అరెస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. 
 
ఇందులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అర్జున్ రాంపాల్, భారతీ సింగ్ దంపతులను విచారించింది. ఇలా దర్యాప్తు చేస్తూనే డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్న ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. 
 
అయితే ఎజాజ్ ఖాన్‏ను అరెస్ట్ చేసింది ఇది మొదటి సారికాదు. 2018లో నవీ ముంబై పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. నిషేధిత మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2020 ఏప్రిల్ నెలలో ఫేస్‌బుక్‌లో అభ్యంతకరమైన పోస్ట్ చేసినందుకుగానూ అతన్ని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో ఎజాజ్ పోలీసులకు చిక్కడం గమనార్హం.