గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (11:32 IST)

సుశాంత్‌కి బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ లేరు.. లోతుగా దర్యాప్తు జరిపించాలి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తన సోదరుడి మరణంపై లోతుగా దర్యాప్తు జరిపించాలని సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తమకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని పారదర్శక విచారణకు ఆదేశించాలని కోరారు. 
 
ఈ మేరకు శనివారం శ్వేత ట్విట్టర్‌లో ఓ లేఖను షేర్‌ చేశారు. సత్యం వైపే మీరు నిలబడతారని తన మనస్సు చెప్తోందని.. సాధారణ కుటుంబం నుంచి పైకొచ్చామని.. తన సోదరుడికి బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్‌ లేరు. మా పరిస్థితి కూడా అదే. మీరు ఈ విషయాన్ని పరిశీలించి.. సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, పారదర్శంగా విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. "నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరిని. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.  మాకు న్యాయం కావాలి'' అంటూ ప్రధాని మోదీ, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. 
 
కాగా జూన్‌ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఒత్తిడితో అతడు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తొలుత బాలీవుడ్‌ పెద్దలపై బంధుప్రీతి ఆరోపణల చుట్టూ తిరిగిన కేసు.. సుశాంత్‌ తండ్రి.. నటి, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిపై పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీలక మలుపు తిరిగింది. 
 
డబ్బుకోసమే సుశాంత్‌ను వాడుకుని వదిలేసిందంటూ రియాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన రియా.. తను సుశాంత్‌తో సహజీవనం చేసిన విషయం వాస్తమేనని, జూన్‌ 8 వరకు తనతో ఉన్నానంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొనడంతో వీటికి మరింత బలం చేకూరింది. 
 
అంతేగాక రియాకు సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రూ. 15 కోట్ల మేర బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుపై దృష్టి సారించిన ఈడీ.. ఆమెపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇక ఈ విషయంలో సుశాంత్‌ కుటుంబానికి అండగా నిలిచేందుకు బిహార్‌ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ముంబై పోలీసులను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సమర్థించారు. సుశాంత్ కేసును దర్యాప్తు చేయడంలో మహారాష్ట్ర పోలీసులు సమర్థవంతులే అని ఆయన అన్నారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ స్పందించారు. ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ వైఖరిని ఉద్దవ్ తప్పుపట్టారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న ఫడ్నవీస్‌.. ముంబై పోలీసుల విశ్వాసాన్ని అనుమానించడం సరైందికాదన్నారు. ముంబై పోలీసులు కరోనా యోధులుగా పనిచేస్తున్నారని, ఇన్‌ఫెక్షన్ వల్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు ఠాక్రే తెలిపారు.  
 
ఈ కేసును దర్యాప్తు చేపట్టి, నేరస్తుల్ని శిక్షిస్తామని తెలిపారు. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బీహార్ పోలీసుల సమస్యగా చూడవద్దు అని సీఎం ఉద్దవ్ తెలిపారు. ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో.. బీహార్ పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తున్నారు.
 
ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ లీలా భన్సాలీ, రాజీవ్ మాసంద్‌, సంజనా సంఘీ, రియా చక్రవర్తి, షానూ శర్మ, ముఖేశ్ చాబ్రా, ఆదిత్య చోప్రాలను ప్రశ్నించారు. దాదాపు 40 మంది వాంగ్మూలం తీసుకున్నారు. జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.