గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (10:05 IST)

ఆకట్టుకునే 'దిక్సూచి'.. నాలుగు యుగాల్లో ఏం జరిగింది?

నటీనటులు : దిలీప్‌కుమార్‌ సల్వాది, చత్రపతి శేఖర్‌, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని
కేతికత: దర్శకత్వం : దిలీప్‌కుమార్‌ సల్వాది, 
నిర్మాతలు : శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి, 
సంగీతం : పద్మనాభ్‌ భరద్వాజ్‌, 
సినిమాటోగ్రఫర్‌ : జయకష్ణ.
 
 
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి హీరోగా ఎదిగిన దిలీప్‌కుమార్‌ సల్వాది నటించి దర్శకత్వం చేసిన చిత్రం 'దిక్సూచి'. భక్తిభావంతో సెంటిమెంట్‌ను రంగరించి తెరకెక్కించిన చిత్రమిది. ట్రైలర్‌లోనే ఆసక్తిని రగిలించిన ఈ చిత్రం ఈశుక్రవారమే విడుదలైంది. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ :
దిలీప్‌ (దిలీప్‌ కుమార్‌) ఓ భక్తి ఛానల్‌కు చెందిన రిపోర్టర్‌. అందులో భాగంగా ఓ దేవాలయంలో తొలి చూపులోనే చాందిని చూసి ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ట్రైన్‌ జర్నీలో ఓ వ్యక్తి చెప్పిన కథ తాలూకా అనుభవాలు అతన్ని వెంటాడుతాయి. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి తన వాళ్లను చంపేస్తానని బెదిరచడంతో దిలీప్‌ భయపడిపోయి తన వాళ్లను తనకు తెలియకుండా కిడ్నాప్‌ చేస్తాడు. 
 
దీన్ని శోధించే క్రమంలో ఓ పోలీసు అధికారి దగ్గరకు వెళ్ళడంతో 1975లో ఇలాంటిదే జరిగిందని చెప్పడంతో రాజా బుధురాపురం వెళతాడు. అక్కడ రాజును కలిసి వివరాలు సేకరిస్తాడు. దానికీ ఇప్పుడు తన జీవితంలో జరుగుతున్నదానికి ఏదో లింక్‌ ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ ఊరికి, దీలిప్‌ ఉన్న సంబంధం ఏంటి ? అసలు ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు ? ఎందుకు అతను కిడ్నాప్లు చేస్తాడు? అనేదే మిగతా సినిమా.
 
విశ్లేషణ:
పరిశోధన, మర్డర్‌, మిస్టరీ కథాంశాలలో ఆసక్తి అనేది కీలకం. దాన్ని హీరో, దర్శకుడు బాగా చూపించగలిగాడు. ఫస్టాఫ్‌లో కథను రక్తికట్టించాడు. చిన్నవయస్సులోనే పెద్ద బాధ్యతను మోయడం అభినందనీయం. నటీనటుల పరంగా అందరూ బాగా నటించారనే చెప్పాలి. ఎమోషన్స్‌ బాగా మెయింటెన్‌ చేశాడు. హీరో పాత్ర తర్వాత అంతగా చెప్పుకోదగింది 'ఛత్రపతి' శేఖర్‌ పాత్ర. 
 
ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్‌ చాందిని, బిత్తిరి సత్తి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ధన్వి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.ఆలాగే సినిమాకు ఫస్ట్‌ హాఫ్‌ చాలా ప్లస్‌ అయ్యింది. ఇంట్రో సీన్లతో ఎక్కువ లాగ్‌ చేయకుండా డైరెక్ట్‌ గా స్టోరీలోకి తీసుకుపోయాడు డైరెక్టర్‌. దాంతో సినిమాలో తరవాత ఏం జరుగుతుంది అనే సస్పెన్సు క్రియేట్‌ చేయగలిగాడు. 
 
ఇక రన్‌ టైం తక్కువగా ఉండడం కూడా ఈ సినిమా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా నాలుగు యుగాల్లో ఏం జరిగింది? వాటిలో మానవజాతి ఏవిధంగా పరిణామక్రమం చెందింది అనే విషయాలను బొమ్మలరూపంలో బాగా విశ్లేషించాడు. ఒకవైపు వేదాలను టచ్‌ చేస్తూనే మరోవైపు వర్తమానానికి వర్తించే చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతున్నదనేది క్రియేట్‌ చేయడం విశేషం. 
 
హీరోగా చేస్తూ దర్శకత్వం వహించడమే చాలా కష్టంతో కూడిన పనే అయినా తగిన న్యాయం చేశాడు. కథనంలో కొన్నిచోట్ల చిన్నపాటి లోపాలున్నా దాన్ని అధిగమించేట్లుగా చూపించాడు. కానీ తన వారిని ఊరిజనాలముందు అవమానించడం పట్ల శేఖర్‌ పాత్ర చూపిన కసి, ఆవేదన, ఈర్ష అనే కోణాలు బాగున్నా.. శివలింగాన్ని టార్గెట్‌ చేయడంతో కథనంలో కాస్త ట్రాక్‌ తప్పినట్లు అనిపిస్తుంది. ఆ సన్నివేశం తగ్గిస్తే బాగుండేది. 
 
మొదటిభాగం త్వరగా పూర్తయినంది అనిపించినట్లుగా రెండోభాగం ఎక్కువ సేపు వుండడానికి కారణం అలాంటి సీననే చెప్పాలి. ఇక పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌పై మరింత కసరత్తు చేయాల్సింది. రాజు పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తే మరింత ఆకట్టుకునేలా వుండేది. సాంకేతికంగా చూస్తే జయకష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్‌ అయ్యింది. 
 
పిరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను బాగా చూపెట్టాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా సన్నివేశాలను ఎలివేట్‌ చేయగలిగింది. ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా వున్నాయి. మర్డర్‌ మిస్టరీ వంటి కథలు ఎంతటివారినైనా ఆకర్షిస్తాయి. అందుకే ప్రవాసాంధ్రులు నిర్మించిన ఈ చిత్రం ఆకట్టుకునేలా చేయగలిగారు. వున్న సాంకేతిక విలువలతో ఇటువంటి సినిమా తీయడం నిజంగా సాహసమే. 
 
చూసిన ప్రేక్షకుడు నిరుత్సాహపడడు. రొటీన్‌ఫార్మెట్‌లో వస్తున్న ఈ మధ్య సినిమాలకు భిన్నంగా దర్శక నిర్మాతలు ఆలోచించి తీయడం ప్రత్యేకత. అందుకే ముగింపులో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వుంటుందనే ట్విస్ట్‌ ఇచ్చారు. అందరూ ఒకసారి చూడగలిగే చిత్రమిది.