శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (14:17 IST)

గోరుముద్దలు పెట్టిన మహిళా పోలీస్.. వీడియో కాల్ చేసి అభినందించిన చిరంజీవి

ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలోను ప్రారంభించిన చిరంజీవి.. అప్పటి నుంచి అదిరిపోయే పంచ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. పైగా, కోవిడ్ విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించేలా ట్వీట్లు చేశారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఒడిషాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారిణి... సాటి మహిళ పట్ల మాతృమూర్తి ప్రేమను చూపింది. మతిస్థిమితం లేని మహిళకు స్వయంగా అన్నం తినిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ అయింది. అది చిరంజీవి దృష్టికి వచ్చింది. అంతే.. ఆ మహిళా పోలీస్ అధికారిణి మొబైల్ నంబరు తీసుకుని వీడియో కాల్ చేసిన చిరంజీవి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పరిపూర్ణమైన మాతృమూర్తిగా మారిపోయి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని కీర్తించారు. కాగా, ఆ మహిళా అధికారిణి పేరు శుభశ్రీ. ఈమెకు చిరంజీవికి మధ్య జరిగిన సంభాషణలు క్లుప్తంగా పరిశీలిస్తే, 
 
చిరంజీవి: గుడ్ మార్నింగ్ శుభశ్రీ జీ
శుభశ్రీ: సర్ నమస్తే సర్
 
చిరు: నమస్తే నమస్తే.. ఆ శుభశ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది.. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు  చాలా సంతోషించాను. ఎంతో బాధ్యతగా మీరు ఈ పని చేయడానికి కారణమేంటీ?
శుభశ్రీ: నేను ఆవిడకి ప్రత్యేకించి ఏమీ చేయలేదు సర్... నేను భోజనం అందించినప్పుడు ఆవిడ తినే పరిస్థితుల్లో లేదు. దీంతో నేను ఆమెకు తినిపించాను.
 
చిరంజీవి: మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు.
శుభశ్రీ: బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్‌ కాపాడడం మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. మీరు నాతో మాట్లాడుతుండడంతో నేను ఎంతో ఉత్తేజం పొందుతున్నాను. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
చిరంజీవి, శుభశ్రీల మధ్య జరిగిన పూర్తి సంభాషణ వీడియోను మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.