శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (17:58 IST)

అక్కడ బాణాసంచా అమ్మకం - వినియోగంపై నిషేధం.. ఎక్కడ?

దీపావళి అంటేనే బాణాసంచా. దీపావళి పండుగ అంటనే మతలబులు కాల్చడం. కానీ అక్కడ మాత్రం ఈ యేడాది టపాకాయల విక్రయాలతో పాటు.. వినియోగంపై నిషేధం విధించారు. అంటే.. ఆ ప్రాంత వాసులు బాణాసంచా కాల్చకుండానే దీపావళి పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం ఏదో కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీనే. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో నవంబరు 9వ తేదీ అర్థరాత్రి నుంచి నవంబరు నెలాఖరు వరకు అంటే నవంబరు 30వ తేదీ వరకు బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(ఎన్‌జీటీ) పూర్తి నిషేధం విధించింది. 
 
దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఇక ఈ ఉత్తర్వు నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 24 జిల్లాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్‌లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. 
 
అలానే గాలి నాణ్యత మోడరేట్‌గా ఉన్న నగరాలు, పట్టణాల్లో​ తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్‌ క్రాకర్స్‌ని మాత్రమే అనుమతించింది. అదికూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీపావళి, గురుపూర్‌లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్‌లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది. 
 
ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్‌ క్రాకర్స్‌ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్‌జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. 
 
ప్రతి యేటా ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. 
 
తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని  ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్‌ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది.