మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (10:03 IST)

భార్య పట్ల పతిభక్తి : భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమలకు భర్త నడక

alipiri metlu
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. అయితే, ఈ బ్రహ్మోత్సవాల్లో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి కనిపించింది. ఓ భర్త తన భార్యను భుజాలపై ఎత్తుకుని నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. 
 
దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, కడియపులంకకు చెందిన వరద వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, లావణ్య దంపతులు ఉన్నారు. వీరు లారీ యజమానాలు. ఈ దంపతులు తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరిద్దరూ అలిపిరి మెట్లమార్గంలో నడుస్తూ బయలుదేరారు. 
 
అయితే, సత్తిబాబు వేగంగా నడిచిపోతున్నాడు. దీన్ని గమనించిన భార్య లావణ్య.. తనను ఎత్తుకుని నడవాలంటూ తమాషాగా కోరింది. అంతే, భార్య తమాషాగా అడిగినప్పటికీ భర్త మాత్రం దాన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. భార్యను తన భుజాలపై ఎత్తుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. 
 
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కాడు. తన భుజాలపై భార్యను ఎక్కించుకుని సత్తిబాబు మెట్లు ఎక్కుతుండన్ని మరికొందరు భక్తలు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వార్తల వైరల్ అయింది.