బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (11:39 IST)

మహా విష్ణువు పదో అవతారం నివాసంలో కరెన్సీ నోట్లు ... బంగారం - వజ్రాలు

మహా విష్ణువు పదో అవతారంగా చెప్పుకునే కల్కి భగవాన్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే నోట్ల కట్టలతో పాటు... బంగారం, వజ్రాలతో పాటు.. గుప్త నిధులు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే రూ.45 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, లెక్కల్లోకి రాని నగదు రూ.409 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. వీటిలో రూ.18 కోట్ల విలువైన అమెరికా డాలర్లు కూడా ఉన్నాయి. 
 
చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెంలో ఈ మహావిష్ణువు పదో అవతారంగా చెప్పుకునే కల్కి భగవాన్ ఉన్నారు. ఈయన ఆశ్రమంలో తవ్వేకొద్దీ నగదు, నగలు, వజ్రాలు, ఆదాయంలో చూపని ఆస్తులు బయటపడుతున్నాయి. కల్కి భగవాన్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు చేస్తున్నట్లు తేలింది. ఆశ్రమ ప్రధాన కేంద్రమైన వరదాయపాళెంతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలోని ఆశ్రమాలు, కార్యాలయాలు, నివాసాల్లో జరిపిన సోదాల్లో సుమారు రూ.500కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం ప్రకటించింది. 
 
ఇందులో రూ.43.9 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన అమెరికా డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన వజ్రాలు గుర్తించారు. 'భారత్‌లో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారు. చైనా, అమెరికా, సింగపూర్‌, యూఏఈతోపాటు పన్ను ఎగవేతకు పేరొందిన అనేక దేశాల్లో కల్కి భగవాన్‌ వ్యాపారాలు విస్తరించాయి' అని ఐటీ శాఖ విడుదల చేసి ఓ ప్రకటనలో పేర్కొంది.