గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (09:56 IST)

చెత్త బండిగా మారిన బీఎండబ్ల్యూ కారు... ఎక్కడ?

తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు ఇపుడు చెత్తబండిగా మారిపోయింది. దీనికి కారణంగా ఆ కారే. కొత్త కారును కొనుగోలు చేసిన ఆ పారిశ్రామికవేత్త.. కారుతో పాటు సమస్యలు కూడా కొని తెచ్చుకున్నాడు. ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీకి చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ తన తండ్రికి బహుమానంగా ఇచ్చేందుకు రూ.90 లక్షలు ఖర్చు చేసి బీఎండబ్ల్యూ కారును కొత్తగా కొనుగోలు చేశాడు. అయితే, ఈయన కొత్త కారుతోపాటే సమస్యలు కూడా కొనితెచ్చుకున్నాడు. 
 
కారు కొనుగోలు చేసినప్పటి నుంచి తరచూ ఏదో ఒక సమస్య బయటపడుతుండడంతో సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా మరో కొత్త సమస్య బయటపడుతోంది. 
 
దీంతో షోరూంకు తీసుకెళ్లడానికి అతడికి, దానిని మరమ్మతు చేయలేక షోరూం సిబ్బందికి విసుగొచ్చింది. దీంతో విసిగిపోయిన శ్రీవాస్తవ ఇలా లాభం లేదనుకుని లక్షలు పోసి కొన్న కారును చెత్త బండిగా మార్చేసి బీఎండబ్ల్యూ కంపెనీపై నిరసన వ్యక్తం చేశాడు. వీధుల్లో చెత్తను ఏరి దానిని కారు డిక్కీలో నింపుతూ నిరసన తెలిపాడు.
 
అంతేకాదు, 'చెత్తబండి వచ్చింది చెత్త తీసుకురండి' అంటూ పెద్ద శబ్దంతో పాటలు కూడా పెడుతుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి సమస్యలు తానొక్కడినే ఎదుర్కోవడం లేదని, ఇలాంటి కారే కొనుగోలు చేసిన క్రికెటర్లు ఇషాన్ కిషన్, అజాతశత్రు సింగ్ కూడా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరలోనే కంపెనీపై కోర్టుకు వెళ్తానని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.