1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (15:52 IST)

భారత గడ్డపై దిగిన రాఫెల్ యుద్ధ విమానాలు

భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా 35 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తొలి విడతలో ఐదు విమానాలను భారత్ అత్యవసరంగా తెప్పించుకుంది. ఈ విమానాలు సోమవారం ఫ్రాన్స్‌లో బయలుదేరి... 7 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి... బుధవారం మధ్యాహ్నం భారత గడ్డపై ల్యాండ్ అయ్యాయి. బుధవారం ఉదయం భారత గగనతలంలోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాలు.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానికి స్థావరానికి చేరుకున్నాయి. 
 
అంతకుముందు.. ఈ విమానాలు సోమవారం మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన 7 గంటల తర్వాత విమానాలు కొద్దిసేపు యూఏఈలోని అల్‌ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి. ఈ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు వీటిని తోడుకుని వస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
కాగా, మంగళవారం 30 వేల అడుగుల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అంబాలా వైమానిక స్థావరం వద్ద భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదూరియా కొత్త విమానాలను స్వీకరించారు. 
 
గత రెండు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం అందుకుంటున్న తొలి కీలక అస్త్రం రాఫెల్ యుద్ధ విమానమే కావడం విశేషం. పాక్, చైనా కవ్వింపుల నేపథ్యంలో ఇది గేమ్ ఛేంజర్ కాగలదని రక్షణశాఖ నిపుణులు భావిస్తున్నారు.