గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (09:50 IST)

ఆస్పత్రి బెడ్‌పైనే గంటలపాటు కరోనా రోగి శవం.. స్మశానవాటిక నుంచి పర్మిషన్ రాలేదట!

Patna Hospital
కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు ప్రజలు వైరస్ సోకకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కోవిడ్ సోకిన బాధితుల కష్టాలు అంతా ఇంతా కాదు. వైరస్ సోకిందనే బాధ కంటే ఆస్పత్రుల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్న తీరు దారుణంగా ఉంది. ఎందుకు ఈ మాయరోగం మనకు అంటుకుందని చాలామంది బాధపడే స్థాయికి అధికారులు చేర్చుతున్నారు. 
 
ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువవయ్యాయి. తాజాగా బీహార్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆస్పత్రిలో కరోనాతో ఓ రోగి మరణిస్తే.. శవాన్ని రోగుల మధ్యే గంటల తరబడి వదిలేశారు. దీంతో భయం భయంగానే మిగితా వారంతా కాలం గడపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఓ కరోనా బాధితుడు మరణించాడు. 
 
దీంతో అతన్ని మార్చురీకి తరలించకుండా వైద్య సిబ్బంది అతడు ఉంటున్న బెడ్‌పైనే వదిలేసి వెళ్లిపోయారు. గంటలు గడుస్తున్నా ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆ వార్డులో ఉన్న మరో ఏడుగురు రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఆస్పత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వైద్య కాలేజీ ప్రిన్సిపల్ స్పందించారు. 
 
బాన్స్ ఘాట్ స్మశానవాటికలో రాత్రి 8 గంటల తర్వాతే అనుమతి ఉండటంతో వారిని అలాగే వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన నిర్లక్ష్యపు సమాధానం మరింత వివాదానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడ చికిత్స పొందలేమని రోగులు వాపోతున్నారు.