శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (14:37 IST)

నలంద కిషోర్‌ను ప్రభుత్వం హత్య చేసింది : చంద్రబాబు

విశాఖ జిల్లాలో టీడీపీ అభిమాని, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు నలందా కిషోర్ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. నలంద కిషోర్‌ను ప్రభుత్వమే హత్య చేసిందంటూ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 
 
"విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు". 
 
"అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా? నలంద కిషోర్ మృతి ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కిషోర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది" అంటూ నిలదీశారు.