శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (14:36 IST)

ఆంధ్రాలో కరోనా వైరస్ చేయిదాటిపోయింది .. కేంద్రం జోక్యం చేసుకోవాలి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయిందని, అందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యల తీరుతెన్నులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
పేలవమైన కరోనా రికవరీ రేటు (9.74)తో జాతీయస్థాయిలో ఏపీ అట్టడుగున ఉందని తెలిపారు. అంతేకాదు, అత్యధిక యాక్టివ్ కేసుల (11,200) జాబితాలో ఐదోస్థానంలోకి వచ్చేసిందని వివరించారు. దీనికితోడు ఫేక్ ఎస్సెమ్మెస్ కరోనా టెస్టుల కుంభకోణం ఈ సంక్షోభాన్ని మరింత ప్రబలం చేసిందని విమర్శించారు. ఏపీ కరోనా నివారణ చర్యల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
 
అలాగే, విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 
 
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలం ఇప్పటికే వివాదంలో ఉందని... దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం పేరిట వైసీపీ నేతలు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
 
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత కంపెనీ ప్రతినిధులపై కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. కేసులు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిన విషయమేనని, అయితే కంపెనీని అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి విదేశాల్లో ఎంత పరిహారాన్ని ఇస్తారో, ఇక్కడ కూడా అంత ఇవ్వాలని డిమాండ్ చేశారు.