శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (17:55 IST)

శతకంతో రెచ్చిపోయిన కోహ్లీ..(video)

కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు విజయాన్ని దక్కించుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కడంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ భువనేశ్వర్ నాలుగు వికెట్లు తీశాడు. అయితే, వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదేసమయంలో రికార్డు వన్డేలో క్రిస్ గేల్ ఉసూరుమనిపించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ (2), రోహిత్ శర్మ (18)లు నిరాశపరిచారు. పరుగుల యంత్రం కోహ్లీ తన మునుపటి ఆటతీరుతో అదరగొట్టాడు. వన్డేల్లో 42వ శతకం సాధించాడు. మొత్తం 125 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 14 ఫోర్లు, సిక్సర్‌తో 125 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ (20), శ్రేయాస్ అయ్యర్ 71, కేదార్ జాదవ్ 16, రవీంద్ర జడేజా 16 చొప్పున పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 280 పరుగుల భారీ విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన విండీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి బెంబేలెత్తించాడు. దీంతో విండీస్ 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
 
కాగా, తన సినీ కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరమనిపించాడు. కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. ఎవిన్ లూయిస్ 65, నికోలస్ పూరన్ 42 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మూడే వన్డే 14న జరగనుంది. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండా మ్యాచ్ ముగిసిన విషయం తెల్సిందే.