మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (09:55 IST)

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

world cancer day
దేశానికి కేన్సర్ పెను సవాల్‌గా మారింది. ఈ ప్రాణాంతక వ్యాధిబారినపడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఫలితంగా 2025లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 15 లక్షల కేన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతియేటా ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా దాని నియంత్రణ, నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స్పందించారు. 
 
భారతదేశానికి 2025లో కేన్సర్ ముఖ్యమైన ప్రజారోగ్య సవాల్‌గా మారిందన్నారు. ఈ యేడాది ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 15 లక్షల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మహమ్మారిని నోటిఫయబుల్ డిసీజ్‌గా గుర్తించి.. దాని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. దేశంలో నమోదవుతున్న కేన్సర్ మరణాల్లో మూడింట రెండు వంతులు... పొగాకు, మద్యం, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభ
వించేవేనని, ఈ కేన్సర్లన్నీ నిరోధించదగ్గవన్నారు. అయితే, తొలి దశలో గుర్తించి, సత్వర చికిత్సతో నయంచేయదగ్గవేనని అభిప్రాయపడ్డారు. 
 
'కేన్సర్ పోరులో అందరూ కలిసిరావాలి' అంటూ విధాన నిర్ణేతలు, వైద్య నిపుణులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేన్సర్ రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయాలను ప్రకటించడంపై ప్రశంసల జల్లు కురిపించారు. కేన్సర్ బాధితుల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడం, 36 ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు, మూడు ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు. మూడేళ్లలో జిల్లాకో కేన్సర్ డే కేర్ కేంద్రం ఏర్పాటు వంటి నిర్ణయాలను... ఆ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, బాధితులకు అత్యున్నతస్థాయి వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సిన కీలక అవసరాన్ని కేంద్రం నొక్కిచెప్పిన తీరును కొనియాడారు. కేన్సర్‌ను జయించినవారి సంఖ్య (సర్వైవల్ రేటు) పెరగాలంటే.. దాన్ని సకాలంలో గుర్తించడమే ముఖ్యమని ఆయన తేల్చిచెప్పారు. 
 
"తొలి దశలోనే గుర్తించగలిగితేగనక చాలా కేన్సర్లకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ముందు మనం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన వ్యక్తులకు కేన్సర్ గుర్తింపు, చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు. 
 
భారత వైద్య పరిశోధన మండలి తదితర సంస్థల విశ్వసనీయ సమాచారం ప్రకారం. మన దేశంలో నిత్యం 200 మంది సర్విక్స్ కేన్సర్‌తో చనిపోతున్నారని.. అన్ని రకాల కేన్సర్ బాధితులనూ పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 1600 మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొవిడ్ మహమ్మారిపై మన దేశం చేసిన పోరాటం నుంచి నేర్చుకున్న విలువైన పాఠాలు కేన్సర్‌పై  పోరులో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.