సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు... కొత్త మార్గదర్శకాలు  
                                       
                  
				  				  
				   
                  				  ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్, నోడల్ అధికారి, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
				  																												
									  
	 
	"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. 
				  
	 
	ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్ మీడియాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 
				  																																			
									  
	 
	సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చిందని తెలిపారు. 
				  																		
											
									  
	 
	కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫ్డ్ చిత్రాలు ఉన్న కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలి." అని వివరించారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 
				  																	
									  
	 
	గ్రీవెన్స్ అధికారి తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.