1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (13:13 IST)

నరబలి పేరుతో పదేళ్ల బాలుడిని గొంతుకోసి చంపేసిన బంధువు.. ఎక్కడ?

murderer
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ళ బాలుడిని నరబలి ఇచ్చారు. మూఢనమ్మకం పేరుతో జరిగిన ఈ హత్యలో పదేళ్ల బాలుడిని సొంత బంధువే గొంతుకోసి చంపేశాడు. ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాపర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకు వివేక్ వర్మ అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరి బంధువు అనూప్ అనే వ్యక్తి కూడా అదే గ్రామంలో నివసిస్తున్నాడు అనూప్‌కు రెండున్నరేళ్ల కుమారుడు ఉండగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 
 
ఎంతో మంది వైద్యుల వద్ద వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనూప్ ఓ మాంత్రికుడిని సంప్రదించగా, నరబలి ఇస్తే బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. అంతే.. మంత్రగాడి మాటలు నమ్మిన అనూప్.. వివేక్ వర్మకు మాయమాటలు చెప్పి తన వెంట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ వివిధ రకాల పూజలు చేసి గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పేర్కొంటూ వివేక్ వర్మ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
వివేక్ వర్మ కోసం చుట్టు పక్కల గ్రామాల్లోనూ గాలించగా, ఇంటికి సమీపంలోని పొలాల్లో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయం వెలుగు చూసింది. మంత్రగాడి మాటలు విన్న అనూప్.. ఈ దారుణానికి పాల్పడినట్టు తేలడంతో అతనితో పాటు మాంత్రికుడు, వీరికి సహకరించిన చింతారామ్ అనే వారిని అరెస్టు చేసినట్టు బహ్రైచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు.