అధికారంలోకి వస్తే యువతకు స్మార్ట్ ఫోన్లు .. యేడాది పాటు ఫ్రీ డేటా: పంజాబ్లో కాంగ్రెస్ హామీ
వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తి మేరకు హామీలను గుప్పిస్తున్నాయి.
వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తి మేరకు హామీలను గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. యువ ఓటర్లను తమ వైపునకు ఆకర్షించే చర్యల్లో భాగంగా స్మార్ట్ ఫోన్ హామీని గుప్పించింది.
తమ పార్టీని అధికారంలో తీసుకొస్తే యువతకు 50 లక్షల స్మార్ట్ఫోన్లు అందిస్తామని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. యేడాది పాటు ఉచితంగా డేటా అందిస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంజాబ్ యువతను సాధికారత వైపు మళ్లించడంతో పాటు డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం చేస్తామన్నారు. వేలాది మంది యువకుల సమక్షంలో ‘కెప్టెన్ స్మార్ట్ కనెక్ట్’ పేరిట స్మార్ట్ ఫోన్ పథకం ప్రారంభించారు.
దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ నెల 30లోగా ఇందులో రిజిస్టర్ చేసుకున్న 18 నుంచి 35 ఏళ్ల లోపు పంజాబ్ యువకులకు... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 4జీ స్మార్ట్ఫోన్ ఉచితంగా అందిస్తామన్నారు. అయితే, వెబ్సైట్ను ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే అక్కడి యువకుల నుంచి భారీ స్పందన వచ్చింది. వేలాదిమంది యువకులు ఫోన్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు పోటీపడ్డారు. ఇక ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ను గంటలోనే 8,200 మంది వీక్షించడంతోపాటు.. 1200 మంది లైక్లు కొట్టారు.