Balloon : బెలూన్ మింగేసిన ఏడు నెలల శిశువు.. ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తే?
తమిళనాడు, తంజావూరు సమీపంలో బెలూన్ మింగడంతో ఏడు నెలల శిశువు ఊపిరాడక మరణించిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి తంజావూరు జిల్లాలోని ఒరతనాడు సమీపంలోని తిరువోనం తాలూకా ఊరనిపురం గ్రామానికి చెందిన సతీష్కుమార్, శివగామి దంపతుల 7 నెలల పసికందు అకస్మాత్తుగా శ్వాస ఆడక ఇబ్బందికి గురైంది.
దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ బిడ్డను పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బిడ్డను పరీక్షించిన వైద్యులు అప్పటికే బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. బిడ్డ మృతిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో చిన్నారి శ్వాసనాళంలో బెలూన్ ఇరుక్కుపోయిందని తేలింది. ఆ బెలూన్ను మింగడంతో ఊపిరాడక చిన్నారి చనిపోయిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడుకునే బొమ్మలపై చాలా శ్రద్ధ వహించాలని, అలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించాలని వైద్యులు సూచించారు.
ఈ సంఘటనపై తిరువోణం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. ఆ పిల్లవాడు బెలూన్ను ఎలా మింగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.