శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (10:43 IST)

అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరిన షాయాజీ షిండే

sayaji shinde
ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేశారు. శుక్రవార ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆయనకు అజిత్ పవార్ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని అజిత్ పవార్ వెల్లడించారు. పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ షిండే ఉంటారని తెలిపారు.
 
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తాను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించానని గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ నడవడిక తనను ఆకర్షించిందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి పవార్‌తో చర్చించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. మరింత సమవర్ధవంతంగా పని చేసేందుకే పార్టీలో చేరానన్నారు.
 
కాగా, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన షిండే.. తన చదువు కొనసాగిస్తూనే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో కొన్నాళ్లపాటు వాచ్‌మెన్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆయనకు నటనపై ఆసక్తి ఏర్పడింది. అలా 1978లో మరాఠీ నాటకాలతో తన కెరీర్‌ను ప్రారంభించారు. 
 
1995లో మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. హిందీ, తమిళం, కన్నడ, భోజ్‌పురి, ఇంగ్లీష్‌లోనూ ఆయన నటించి మెప్పించారు. 'ఠాగూర్', 'అతడు', 'పోకిరి' వంటి అనేక తెలుగు హిట్ మూవీస్‌లో ఆయన విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగువారికి సుపరిచితమయ్యారు.