శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 13 ఆగస్టు 2019 (20:51 IST)

మిగిలింది నాలుగురోజులే.. మళ్లీ 40 సంవత్సరాలకే.. పోటెత్తుతున్న భక్తులు...

కాంచీపురం అత్తివరదరాజస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. 48 రోజుల ఉత్సవం మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో జనం తండోతండాలుగా తరలివస్తున్నారు. కోటిమంది వరకు వరదరాజస్వామిని దర్శించుకున్నట్లు కాంచీపురం ఆలయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం ఆలయంలో కనిపిస్తున్నారు. గత 40 సంవత్సరాల ముందు కన్నా ఈ యేడు అత్తివరదరాజస్వామి ఆలయంలో జనం పెరగడానికి కారణమేంటి?
 
అత్తి చెట్టుతో చెక్కిన విష్ణు మూర్తి అవతారమే అత్తి వరదరాజస్వామి ప్రతిరూపం. ఆలయాల పైన గతంలో ముష్కరులు దాడి చేసే సమయంలో స్వామివారి మూలవిరాట్‌ను కొలనులోకి తీసుకెళ్ళి దాచి ఉంచారు. 40 సంవత్సరాల తరువాత ఆ విగ్రహాన్ని మళ్ళీ బయటకు తీశారు. అయితే కనీసం విగ్రహం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దీంతో స్వామివారి మహిహను గుర్తించారు ఆలయ అధికారులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అత్తివరదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 
గతంతో పోలిస్తే ఈసారి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల కోసం చేశారు. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు జరుగకుండా మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్త జనం తరలివస్తూనే ఉంది. జూన్ 28వ తేదీన స్వామివారిని కొలను నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత స్వామివారిని అభిషేకించి జూలై 1వ తేదీ నుంచి దర్సనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. 31 రోజుల పాటు స్వామివారు శయన భంగిమలో భక్తులకు దర్సనమిచ్చారు. ఆగష్టు 1వ తేదీ నుంచి స్వామివారు నిలబడిన భంగిమలో భక్తులకు దర్సనమిస్తున్నారు. 
 
స్వామివారిని దర్శించుకునేందుకు వృద్ధులు, చిన్నారులు ప్రతి ఒక్కరు కంచికి తరలివస్తున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే దర్సనానికి సమయం ఉంది. దీంతో భక్తులు రద్దీ మరింత పెరిగింది. సామాన్య భక్తులతో పాటు విఐపిలు, వివిఐపిల తాకిడి ఎక్కువగానే కాంచీపురంలో కనిపిస్తోంది.