1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జూన్ 2025 (08:48 IST)

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

headshave
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఒరిస్సా రాష్ట్రంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను, దూడలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారిద్దరికి అరగుండు చేయించి, బలవంతంగా మురుగు నీరు తాగించారు. ఈ అమానుష సంఘటన గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. ఇది వెలుగులోకి రావడంతో కలకలం చెలరేగింది. 
 
వివరాలను పరిశీలిస్తే, గంజా జిల్లా ధారకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం హరిపూర్ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి ఒక ఆవు, రెండు దూడలను కొనుగోలు చేశారు. వాటిని తీలుకుంటూ తన స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఖారిగుమ్మ అనే ప్రాంతానికి చేరుకోగానే సుమారు కొందరు వ్యక్తుల ముఠా వారిని అడ్డగించి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ ఆరోపిస్తూ వారిపై దాడి చేశాడు. పైగా, వారివద్ద ఉన్న డబ్బును బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నించారు. బాధితులు దీనిని ప్రతిఘటించడంతో నిందితులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 
 
అంతటితో ఆగని ఆ ముఠా.. బాధితులిద్దరికీ అరగుండు గీయించారు. ఆ తర్వాత ఖారిగుమ్మ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహాడ గ్రామం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా వారిద్దరి చేత మురుగు కాలువలో నీటిని తాగించారు. వీధుల్లో మోకాళ్లపై నడిపించి తీవ్రంగా అవమానించారు. 
 
ఈ దారుణం నుంచి బాధితులిద్దరూ ఎలాగోలా తప్పించుకుని తమ గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి తలలు, వీపులపై గాయాలు ఉండటంతో పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ధారకోట పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రిగా స్వయిన్ వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.