1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జూన్ 2025 (20:00 IST)

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

petrol
ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా దేశాలు జరుపుతున్న వరుస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. దీంతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా హెచ్చరించినట్టుగానే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాల్లో చమురు దిగుమతులకు అంతరాయం ఏర్పడి, వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తమపై దాడి చేస్తున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ అవసరాల్లో 20 శాతం హర్మూజ్ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్‍‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం - ఇరాన్‌ల మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి కావడం గమనార్హం. ఇది ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల ముడి చమురు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ ఇలా అనేక దేశాలకు చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అలాగే, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇపుడు ఈ జలసంధిని మూసివేయడంతో పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడి వీటి ధరలు పెరగనున్నాయి.