శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ యుద్ధంలో అమెరికా కూడా వచ్చిచేరింది. దీంతో పశ్చిమాసియాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టెహ్రాన్పై దాడులతో అది మరింత ముదిరింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్తో ఫోన్కాల్ ద్వారా మాట్లాడారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మసౌద్తో మాట్లాడిన ఆయన ప్రస్తుతం జరుపుతున్న దాడులను ఆపేయాలని కోరారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్యమార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లోగా చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ట్రంప్.. టెహ్రాన్పై రెండు రోజుల్లో దాడులు నిర్వహించారు. ఇరాన్లోని మూడు కీలక అణుస్థావరాలై లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
అనంతరం స్పందించిన ఇరాన్.. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్పుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్పై దాడులు కూడా కొనసాగిస్తోంది. ఈ హెచ్చరికలపై స్పందించిన ట్రంప్... ప్రతీకారం చర్యలకు పాల్పడితే ఎన్నడూ చూడని విధంగా దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్పందించిన మోడీ.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.