జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే అంటున్న న్యాయ నిపుణులు!
ఒకే దేశం - ఒకే ఎన్నిక నినాదంలోభాగంగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు భావిస్తోంది. ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే, జమిలి ఎన్నికలకు పలు రాజకీయ పార్టీలు అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టుకు చెందిన పలువురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక అనే విధానం రాజ్యాంగబద్ధమేనని ఆయన చెప్పారు. అయితే ఈ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీ) కి అపరిమిత అధికారాలు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. విచక్షణాధికారాల వినియోగానికి కమిషన్కు తగు మార్గదర్శకాలు అవసరమన్నారు.
ఇదే అంశంపై మాజీ సీజేఐలు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ జేఎస్ కేహర్ తదితరులు జమిలి ఎన్నికల బిల్లుపై మాజీ మంత్రి పీపీ చౌధురి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. జస్టిస్ లలిత్ ఫిబ్రవరిలో, జస్టిస్ కేహర్ మార్చిలో కమిటీని కలిసి బిల్లులోని వివిధ అంశాలపై చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ గొగోయ్ ఈ నెల 11న సదరు కమిటీతో సమావేశంకానున్నారు. ఏకకాలంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చారు. వేర్వేరుగా ఎన్నికలు జరపాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని జేపీసీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు.
అయితే ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో ఈసీకి అత్యధిక అధికారాలు ఇవ్వడాన్ని ఆయన, జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు. చట్టప్రకారం అసెంబ్లీల కాలపరిమితి ఐదేళ్లు. లోక్సభతో పాటే ఎన్నికల పేరుతో... ఈ గడువును కుదించేలా, పెంచేలా హద్దుల్లేని అధికారాన్ని ఈసీకి కట్టబెట్టడం సముచితం కాదన్నారు.