1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 జూన్ 2025 (15:57 IST)

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

vote
దేశ ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి బీహార్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఈ నూతన ఈ-ఓటింగ్ ప్రక్రియను అమలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ప్రకటించారు. ఈ వినూత్న ప్రయోగంతో బీహార్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 
 
శారీరక అనారోగ్యం, వృద్ధాప్యం లేదా ఇతర ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాలతో పోలింగ్ కేంద్రాలకు రాలేని ఓటర్ల సౌలభ్యం కోసమే ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్టు దీపక్ ప్రసాద్ వివరించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, వలస ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఇంటి నుంచే ఓటు వేయడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. 
 
ఈ-ఓటింగ్ కోసం ఓటర్లు తమ మొబైల్ ఫోనులో 'ఈ-ఎస్ఈసీబీహెచ్ఎర్' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఓటరు జాబితాతో అనుసంధానమైన మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్డ్‌ కంప్యూటింగ్ (సీ-డాక్), బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. మొబైల్ ఫోన్ లేని వారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌‍సైట్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
 
ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు ఒక మొబైల్ నంబర్ నుంచి ఇద్దరు రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే లాగిన్ అయ్యేందుకు అనుమతిస్తారు. ప్రతి ఓటు చెల్లుబాటును వ్యక్తిగత ఐడీలతో పోల్చి చూసి నిర్ధారిస్తారు. ఈ కొత్త విధానంపై జూన్ 10 నుంచి 22 వరకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది ఈ ఓటింగ్ కోసం నమోదు చేసుకున్నారని, యాప్, వెబ్‌సైట్ ద్వారా సుమారు 50,000 మంది ఓటు వేసినట్టు అధికారులు అంచనా వేశారు.