కోల్కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా
కోల్కతా నగరంలో తాజాగా జరిగిన అత్యాచార కేసులో తప్పంతా నిందితురాలు న్యాయ విద్యార్థినిదేనని టీఎంసీ నేత మదన్ మిత్రా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర దుమారానికి దారితీశాయి. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలినే తప్పుపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఈ ఘటనపై మదన్ మిత్రా మాట్లాడుతూ, విద్యార్థి సంఘంలో పదవి ఇస్తామని ఎవరైనా పిలిస్తే, కాలేజీ మూసి ఉన్నప్పుడు అమ్మాయిలు వెళ్లకూడదని ఈ ఘటన ఒక సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా, "వెళ్లే ముందు ఆమె ఎవరికైనా సమాచారం ఇచ్చి ఉన్నా లేదా తనతో పాటు ఇద్దరు స్నేహితులను తీసుకెళ్లినా ఈ అఘాయిత్యం జరిగి ఉండేది కాదు. పరిస్థితిని అదునుగా తీసుకుని నిందితుడు ఈ నీచమైన పనికి పాల్పడ్డాడు" అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ టీఎంసీ విద్యార్థి విభాగం (టీఎంసీపీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను మదన్ మిత్రా తోసిపుచ్చారు. "టీఎంసీ చాలా పెద్ద పార్టీ. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు పార్టీతో అనుబంధం ఉన్నవారే ఉంటారు. మేం అందరితోనూ ఫొటోలు దిగుతాం. కానీ, ఒక వ్యక్తి లోపల ఏముందో సైకాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు" అని అ నేతలతో ఫొటోలు దిగి, తమను తాము కూడా టీఎంసీ నాయకులుగా చెప్పుకొనే వారు చాలా మంది ఉన్నారని ఆయన వివరించారు.
ఇదే ఘటనపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. "స్నేహితుడే స్నేహితురాలిపై అత్యాచారం చేస్తే, భద్రత ఎలా కల్పించగలం?" అని ప్రశ్నించారు. ఇప్పుడు మదన్ మిత్రా వ్యాఖ్యలతో అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, విద్యాసంస్థల్లో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సౌత్ సబర్బన్ డివిజన్ (ఎస్ఎస్ఓ) ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఈ కేసులో పోలీసులు పేర్కొన్న ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయలను అరెస్ట్ చేసి, జూలై 1 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు.