25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. 'యాక్సియ-4' మిషన్లో భాగంగా ఈ నెల 25 తేదీన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనంకానున్నారు. ఈ మేరకు మంగళవారం నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. 'యాక్సియం-4' మిషన్ ప్రయోగం 25వ తేదీ మధ్యాహ్నం 12.01 గంటలకు రోదసీలోకి దూసుకెళ్లనుందని తెలిపింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
'యాక్సియం-4'లో శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలెట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ప్రయోగం మే 29వ తేదీన జరగాల్సివుంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదాపడింది.
భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది. శుభాంశు శుక్లా బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడ నుంచి ముచ్చటిస్తారు.