మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (14:05 IST)

రథ సప్తమి: సూర్యునికి ఇలా పూజ.. చిక్కుడు కాయలు, పరమాన్నం...

Surya Namaskar
రథ సప్తమి ఈ ఏడాది ఫిబ్రవరి 4, 2025న వస్తోంది. మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. రథ సప్తమి రోజున సూర్యభగవానుడిని పూజించి ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సూర్యుడికి ఈ రోజున పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. పిడకలపై వుంచిన పాత్రలో పాలు, బెల్లం, కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకుల్లో దాన్ని పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి.. అందులో అక్షింతలు వుంచి సూర్యుడిని ఆవాహన చేస్తారు. సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గోధుమలు, ఎర్రటి పువ్వులు దానంగా ఇవ్వాలని పెద్దలు అంటున్నారు. 
 
అలాగే రథసప్తమి రోజున తిరుమలలో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అరసవెల్లిలోని సూర్య నారాయణ ఆలయంలో ఈ రోజున సూర్యుని కిరణాలు ఆలయంలోని మూల విరాట్టు పాదాలను తాకుతాయి. 
 
రథసప్తమి నాడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సమీపంలో నది లేదా సముద్రం ఉంటే స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే జిల్లేడాకుల నీటితో తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించాలి. ఎక్కువ మంది నది లేదా సముద్ర తీరంలో సూర్య భగవానుని పూజిస్తారు. 
 
సూర్యోదయం కాకముందే పూజ అంతా పూర్తి చేయాలి. రేగి పండ్లు, చెరకు, పాయసం ఇలా అన్నింటితో సూర్య భగవానికి నైవేద్యం సమర్పించాలి. ఇంకా సూర్య పారాయణం, ఆదిత్య హృదయం పఠించాలి. రథసప్తమి రోజున సూర్య ఆరాధన నవగ్రహ దోషాలను తొలగిస్తాయి. కోరిన కోరికలు నెరవేరాలంటే రథ సప్తమి రోజున సూర్య ఆరాధన చేయాలి.